భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన మోసం, లంచం ఆరోపణలకు సంబంధించిన క్రిమినల్ కేసును అమెరికా కోర్టు కొట్టివేసింది. అయితే ఈ కేసును ఉపసంహరించుకోవాలని అమెరికా న్యాయ శాఖ తీసుకున్న నిర్ణయంపై న్యాయమూర్తి నికోలస్ గరాఫిస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
బ్రూక్లిన్కు చెందిన అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గరాఫిస్.. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కేసును కొట్టివేయాలని చేసిన అరుదైన అభ్యర్థనను అంగీకరించారు. అయితే ఈ నిర్ణయం తీసుకునే ప్రక్రియపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా, కేసు దర్యాప్తు చేసిన ప్రాసిక్యూటర్లు, అధికారులు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా న్యాయ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి అదానీ డిఫెన్స్ లాయర్లతో కలిసి కేసును ఉపసంహరించుకునే నిర్ణయం తీసుకోవడం సరికాదని జడ్జి వ్యాఖ్యానించారు.
కేసు ఉపసంహరణలో చోటుచేసుకున్న అవకతవకలు ఆందోళన కలిగిస్తున్నాయని జడ్జి గరాఫిస్ అన్నారు. వివిధ ఫెడరల్ కార్యాలయాలకు చెందిన పలువురు అధికారుల వృత్తిపరమైన అభిప్రాయాలను పక్కనపెట్టి, ట్రెంట్ మెక్కాటర్ తన వ్యక్తిగత నిర్ణయంతో ముందుకు వెళ్లినట్లు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. అయితే అమెరికా న్యాయ శాఖ మాత్రం ఈ నిర్ణయం చట్టపరమైన పరిశీలన, స్వతంత్ర విశ్లేషణ అనంతరం తీసుకున్నదేనని తెలిపింది.
2024లో గౌతమ్ అదానీపై అమెరికా అధికారులు కేసు నమోదు చేశారు. అదానీ గ్రూప్కు చెందిన ఓ అనుబంధ సంస్థకు సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనుమతులు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వడానికి అంగీకరించారని, అనంతరం కంపెనీ అవినీతి నిరోధక విధానాలపై అమెరికా పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారని ఆరోపణలు వచ్చాయి. అయితే అదానీ గ్రూప్ మొదటి నుంచీ ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది.
కేసును ఉపసంహరించుకోవడంలో అదానీ అమెరికాలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతానని గతంలో చేసిన హామీ ప్రభావం చూపిందా? అనే అంశాన్ని కూడా కోర్టు పరిశీలించింది. అదానీ 2024 నవంబర్లో అమెరికాలో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పెట్టుబడి హామీ కేసు పరిష్కారంలో భాగంగా ఉండే అవకాశం ఉందని తన న్యాయవాదులు అమెరికా న్యాయ శాఖతో జరిగిన చర్చల్లో ప్రస్తావించినట్లు అదానీ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో తెలిపారు.
అయితే ఈ పెట్టుబడి హామీ కారణంగానే కేసును ఉపసంహరించుకున్నారనే విషయం తన నిర్ణయానికి కారణం కాదని న్యాయ శాఖ అధికారి మెక్కాటర్ తెలిపారు. మరోవైపు, కేసు ప్రధానంగా విదేశాలకు సంబంధించినదని, ఆరోపణలను నిరూపించడం కష్టమని, అలాగే ఈ కేసు ప్రస్తుతం న్యాయ శాఖ ప్రాధాన్యతలకు అనుగుణంగా లేదని ఆయన కోర్టుకు వివరించారు.
కేసు కొట్టివేయడంపై గౌతమ్ అదానీ స్పందిస్తూ.. అమెరికా కోర్టు నిర్ణయాన్ని వినయంతో, న్యాయ ప్రక్రియపై పూర్తి గౌరవంతో స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే కేసును కొట్టివేసిన నిర్ణయం అదానీ నిర్దోషిత్వంపై కోర్టు తుది అభిప్రాయం అని భావించకూడదని జడ్జి స్పష్టం చేశారు. అలాగే ఇతర నిందితులపై ఉన్న ఆరోపణలను కొట్టివేయాలా వద్దా నిర్ణయించేందుకు న్యాయ శాఖ నుంచి మరింత సమాచారం కోరారు.
ఈ కేసు పరిణామాలు అమెరికా న్యాయ వ్యవస్థలో సమాన న్యాయం, చట్ట పరిపాలన, ప్రభుత్వ ప్రాసిక్యూటర్ల నిర్ణయాలపై మరోసారి చర్చకు దారితీశాయి. కేసు పరిష్కారంలో భారీ పెట్టుబడి హామీలకు ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయాన్ని ప్రజలే నిర్ణయించాలని జడ్జి గరాఫిస్ పేర్కొనడం ఈ వ్యవహారంలో మరింత ఆసక్తిని రేకెత్తించింది.
