తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ బుధవారం అసెంబ్లీలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని మాత్రం ఆయన సమర్థించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల పరిధిలోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, జనాభా నియంత్రణలో ముందున్న తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్కు మద్దతు కూడగట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసిన నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ ఈ తీర్మానం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళా రిజర్వేషన్ను అమలు చేయడానికి డీలిమిటేషన్ అవసరమని కేంద్రం చెబుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది.
విజయ్ తీర్మానంలోని మూడు ప్రధాన డిమాండ్లు
- లోక్సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను శాశ్వతంగా కొనసాగించాలి.
- ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం కేటాయించిన లోక్సభ స్థానాల సంఖ్యను శాశ్వతంగా కొనసాగించాలి.
- రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
విజయ్ మాట్లాడుతూ, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయే అవకాశం ఉందని అన్నారు.
