వ్యాపారవేత్త మానవ్ సర్దానా ప్రస్తుతం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. గురుగ్రామ్లోని డీఎల్ఎఫ్ ‘ది డహ్లియాస్’ ప్రాజెక్ట్లో ఆయన ఏకంగా రూ.271 కోట్ల విలువైన పెంట్హౌస్ను కొనుగోలు చేశారు. ఈ డీల్తో ఒకే రెసిడెన్షియల్ యూనిట్కు జరిగిన అత్యంత ఖరీదైన లావాదేవీల్లో ఇది ఒకటిగా నిలిచింది.
మానవ్ సర్దానాకు దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ తయారీ సంస్థ ఇంపీరియల్ ఆటో ఇండస్ట్రీస్తో సంబంధం ఉంది. ఈ సంస్థను ఆయన తండ్రి దివంగత ఎస్.బి. సర్దానా, జగ్జీత్ సింగ్ కలిసి 1969లో ఫరీదాబాద్లో స్థాపించారు. చిన్న స్థాయి పరిశ్రమగా ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం భారత్లో 20కి పైగా తయారీ కేంద్రాలతో పాటు విదేశాల్లో మరో మూడు కేంద్రాలను నిర్వహిస్తున్న గ్లోబల్ ఆటో కాంపోనెంట్స్ వ్యాపారంగా ఎదిగింది.
ఇంపీరియల్ ఆటో ఇండస్ట్రీస్ ప్రధానంగా ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. హై-ప్రెజర్ అసెంబ్లీస్, మెటల్ ట్యూబ్యులర్ అసెంబ్లీస్, లో-ప్రెజర్ హోస్ అసెంబ్లీస్ వంటి ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు వీటిని సరఫరా చేస్తోంది. ఎలక్ట్రోప్లేటింగ్, బ్రేజింగ్, రబ్బర్ కాంపౌండ్ మిక్సింగ్ వంటి తయారీ ప్రక్రియలకు సంబంధించిన సామర్థ్యాలు కూడా సంస్థకు ఉన్నాయి.
ఇంపీరియల్ ఆటో ఇండస్ట్రీస్ను గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్బర్గ్ పింకస్ కొనుగోలు చేసింది. అయితే మానవ్ సర్దానా మాత్రం ఇంపీరియల్ ఆటో గ్రూప్తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.
ఇక మానవ్ సర్దానా కొనుగోలు చేసిన డీఎల్ఎఫ్ ‘ది డహ్లియాస్’ పెంట్హౌస్ విషయానికి వస్తే.. దీని సూపర్ ఏరియా 17,200 చదరపు అడుగులు కాగా, కార్పెట్ ఏరియా 10,500 చదరపు అడుగులు. రూ.271 కోట్ల డీల్ను పరిశీలిస్తే సూపర్ ఏరియా ప్రకారం చదరపు అడుగుకు సుమారు రూ.1.58 లక్షలు, కార్పెట్ ఏరియా ప్రకారం దాదాపు రూ.2.6 లక్షలు చెల్లించినట్లు లెక్క.
గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఉన్న ‘ది డహ్లియాస్’ డీఎల్ఎఫ్ అత్యంత విలాసవంతమైన రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో ఒకటి. సుమారు 75 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 29 అంతస్తులతో కూడిన 8 టవర్లలో 420 నివాసాలు, 15 డ్యూప్లెక్స్ పెంట్హౌస్లు, 3.5 లక్షల చదరపు అడుగుల క్లబ్హౌస్ ఉన్నాయి. మొత్తం ప్రాజెక్ట్ విలువ రూ.40,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
‘ది డహ్లియాస్’లో గతంలోనూ భారీ విలువైన డీల్స్ జరిగాయి. 2025 అక్టోబర్లో ఢిల్లీ-ఎన్సీఆర్కు చెందిన ఓ పారిశ్రామికవేత్త నాలుగు అపార్ట్మెంట్లను దాదాపు రూ.380 కోట్లకు కొనుగోలు చేశారు. ప్రముఖ ఇన్వెస్టర్ మధుసూదన్ కేలా కూడా ఈ ప్రాజెక్ట్లో రూ.120.7 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు.
గురుగ్రామ్లోని లగ్జరీ హౌసింగ్ మార్కెట్ ఎంత వేగంగా ఖరీదవుతోందో మానవ్ సర్దానా రూ.271 కోట్ల పెంట్హౌస్ కొనుగోలు మరోసారి చూపిస్తోంది. ఒకే ఇంటికి ఇంత భారీ మొత్తం చెల్లించడం వల్ల ఈ డీల్ దేశంలోని అత్యంత ఖరీదైన సింగిల్-యూనిట్ రెసిడెన్షియల్ లావాదేవీల్లో ఒకటిగా నిలిచింది.
