ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ రిసెప్షన్ సోమవారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. పవార్ కుటుంబానికి చెందిన 6, జన్పథ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి దేశ రాజకీయాల్లోని పలువురు ప్రముఖ నేతలు హాజరయ్యారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఈ రిసెప్షన్కు హాజరైన ప్రముఖుల్లో ఉన్నారు. రాజకీయంగా భిన్న అభిప్రాయాలు కలిగిన అగ్రనేతలు ఒకే వేదికపై కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఈ వేడుకకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
సుప్రియా సూలే కుమార్తె రేవతి.. ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మనవరాలు. ఆమె సరంగ్ లఖానీని వివాహం చేసుకున్నారు. రిసెప్షన్ సందర్భంగా నూతన దంపతులు హాజరైన రాజకీయ ప్రముఖులను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పలువురు నేతలు వారితో కలిసి ఫొటోలు దిగారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా పవార్ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తదితరులు వివాహ వేడుకల్లో కూడా పాల్గొన్నారు.
మరోవైపు, ప్రధాని మోదీ, శరద్ పవార్, అమిత్ షా ఒకే ఫ్రేమ్లో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు వ్యక్తిగత, కుటుంబ వేడుకల్లో కలుసుకోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
