పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై రాజ్యసభ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నిరసనలు, సభలో పదేపదే అంతరాయాల కారణంగా కీలకమైన చర్చలకు సమయం తగ్గిపోయిందని పేర్కొన్నారు.
ఈ సమావేశాల్లో రాజ్యసభ మొత్తం 41 గంటల 15 నిమిషాలు మాత్రమే పనిచేసింది. అందుబాటులో ఉన్న సమయంతో పోలిస్తే సభ ఉత్పాదకత 38.88 శాతంగా నమోదైంది. దీనిపై చైర్మన్ “ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం” అని అన్నారు.
సభలో జరిగిన అంతరాయాల వల్ల ప్రజలకు సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశం కోల్పోయామని ఆయన తెలిపారు. పార్లమెంట్ సమయాన్ని గౌరవించి, ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని సూచించారు.
మొత్తంగా ఈ సమావేశాల్లో లోక్సభ ఉత్పాదకత సుమారు 31 శాతం, రాజ్యసభ ఉత్పాదకత సుమారు 39 శాతంగా నమోదైంది.
