కేంద్ర హోంశాఖ (MHA) జాతీయ గీతం ‘జనగణమన’, జాతీయ గీతిక ‘వందే మాతరం’, రాష్ట్ర గీతాలు, విదేశీ దేశాల జాతీయ గీతాల ఆలాపనకు సంబంధించిన మార్గదర్శకాలను మరోసారి స్పష్టం చేస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలకు తాజా ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని పాటించేలా ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించింది.

ప్రభుత్వ కార్యక్రమాల్లో ‘వందే మాతరం’ మరియు ‘జనగణమన’ రెండింటినీ ఆలపించే సందర్భంలో ముందుగా ‘వందే మాతరం’, ఆ తర్వాత ‘జనగణమన’ను ఆలపించాలని స్పష్టం చేసింది. అలాగే రాష్ట్ర గీతం కూడా ఉంటే అది నిర్ణయించిన ప్రోటోకాల్‌కు అనుగుణంగా నిర్వహించాలని పేర్కొంది.

జాతీయ గీతం, జాతీయ గీతికలను పాడేటప్పుడు లేదా వినిపించేటప్పుడు సరైన పదాలు, సరైన ఉచ్చారణ, అధికారిక స్వరరూపంనే ఉపయోగించాలని కేంద్రం ఆదేశించింది. వీటి గౌరవాన్ని కాపాడేలా అన్ని ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు, అధికారిక కార్యక్రమాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

విదేశీ దేశాల జాతీయ గీతాలు వినిపించే కార్యక్రమాల్లో కూడా అంతర్జాతీయ మర్యాదా నియమాలను పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ చిహ్నాల పట్ల గౌరవం, ఏకరీతి విధానం, రాజ్యాంగ విలువలను కాపాడటమే ఈ తాజా మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశమని హోంశాఖ తెలిపింది.

#Government Guidelines, #Jana Gana Mana, #MHA Guidelines, #Ministry of Home Affairs, #National Anthem India, #National Song, #State Anthem, #Vande Mataram