సినిమాలు, వెబ్ సిరీస్లు, ఇతర కాపీరైట్ రక్షణ ఉన్న వీడియోలను అక్రమంగా (పైరసీ రూపంలో) ప్రసారం చేస్తున్న టెలిగ్రామ్ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B) టెలిగ్రామ్కు తాజా నోటీసు జారీ చేసి, పైరసీ కంటెంట్ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. అలాగే, ఈ అంశంపై తీసుకున్న చర్యల వివరాలను 15 రోజుల్లోగా “యాక్షన్ టేకెన్ రిపోర్ట్” (ATR) రూపంలో సమర్పించాలని సూచించింది.
ప్రభుత్వానికి OTT సంస్థలు, సినిమా నిర్మాతలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. విచారణలో 3,100కు పైగా టెలిగ్రామ్ ఛానళ్లు కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ సినిమాలు, వెబ్ సిరీస్లను అక్రమంగా పంచుతున్నట్లు గుర్తించారు.
ఇకపై కేవలం ఒక్కో లింక్ను తొలగించడం కాకుండా, పైరసీని అరికట్టే బాధ్యత మొత్తం ప్లాట్ఫారమ్దేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు పాటించకపోతే టెలిగ్రామ్పై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.
